
జవహర్ నగర్, వెలుగు: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం రాత్రి 12 గంటల వరకు చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఆ సమయంలో ఎంపీ పోగ్రాంలో ఉండటంతో ఆయన పీఏ కాల్ లిఫ్ట్ చేశాడు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది.
మళ్లీ కొద్దిసేపటికి ఆగంతకుడు అదే నంబర్తో ఫోన్ చేసి.. ‘‘సోమవారం రాత్రి 12 గంటల వరకు ఆయన్ను లేపేస్తం’’ అని హెచ్చరించాడు. ఈ ఘటనపై ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టు పార్టీని అంతం చేస్తున్నది.. అందుకే ప్రతీకారంగా బీజేపీ నేతలను బలిచేయాలని మావోయిస్టులు బెదిరింపులకు దిగుతున్నారని ఎంపీ పేర్కొన్నారు.