న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా తన వాహనాల ధరలను పెంచడానికి రెడీ అయ్యింది. జియోపొలిటికల్ ఒత్తిళ్ల మధ్య ముడిసరుకు ఖర్చులు భారీగా పెరిగాయని, ఇందులో కొంత భారాన్ని కన్జూమర్లకు బదిలీ చేయాలని నిర్ణయించామని ప్రకటించింది. కంపెనీ తన అన్ని రకాల మోడల్స్ ధరలను గరిష్టంగా రూ.30 వేల వరకు పెంచనుంది.
జూన్ నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. అయితే మోడళ్లను బట్టి ఈ పెంపు మారుతుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఎంట్రీ-లెవల్ 'ఎస్-ప్రెస్సో' నుంచి ప్రీమియం యుటిలిటీ వాహనమైన 'ఇన్విక్టో' వరకు వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది.
గతేడాది సెప్టెంబర్లో జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత మారుతీ సుజుకీ తన ఎంట్రీ-లెవల్ మోడళ్లయిన ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, సెలెరియో, వ్యాగన్- ఆర్ ధరలను తగ్గించింది. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల వల్ల ఇప్పుడు మళ్లీ ధరలను పెంచాల్సి వచ్చింది.
