నేషనల్ రికార్డ్… నిజామాబాద్ లో 36 టేబుళ్లతో కౌంటింగ్ సెటప్ రెడీ

నేషనల్ రికార్డ్… నిజామాబాద్ లో 36 టేబుళ్లతో కౌంటింగ్ సెటప్ రెడీ

నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ఓట్ల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్ MRMM రావు. ఉదయం 6 గంటలకు అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెడతామని చెప్పారు.

నిజామాబాద్ లోక్ సభ స్థానంలో 186 మంది పోటీ చేశారు. వీరిలో 176 మంది రైతులే కావడంతో.. ఈ ఎన్నిక దేశమంతటా ఆసక్తి రేపింది. మామూలుగా అయితే నిజామాబాద్ లో 14 టేబుళ్లతో కౌంటింగ్ ను నిర్వహించేవారు. అయితే 186 మంది (నోటా తో కలిపి) పోటీచేసే సరికి 36 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. ఒక లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు ఇన్ని టేబుళ్లను ఉపయోగించడం దేశంలోనే మొదటిసారి.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. మరో 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలో నిర్వహించనున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాన్ని.. నిజామాబాద్ నుంచే ప్రకటిస్తారు. ఈవీయంల సంఖ్యతో పాటూ ప్రతీ ఈవీయంలో 5 స్లిప్పులు లెక్కపట్టాల్సి ఉండటంతో ఒక్కో నియోజక వర్గానికి సుమారు ఒక గంట సమయం పట్టనుంది.