పూరి: ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర రెండోరోజు వైభవంగా కొనసాగింది. జై జగన్నాథ్, హరిబోల్ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిపారు. ముందుగా తలధ్వజ రథం, అనంతరం సుభద్రాదేవి దర్పదళన రథం, చివరగా జగన్నాథుడి నందిఘోష రథం గుండిచా ఆలయం ఎదురుగా ఉన్న శరధాబలి వద్దకు చేరుకున్నాయి. దీంతో 9 రోజుల ఉత్సవాల్లో తొలి ఘట్టం ముగిసినట్టయింది. దేవతామూర్తులను రథాల నుంచి గుండిచా ఆలయంలోకి శనివారం సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లనున్నారు. తిరుగు రథయాత్ర జులై 24న నిర్వహిస్తారు.
