- 2030 నాటికి చేరుతుందని డెలాయిట్ అంచనా
- 2022 లో 70 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశంలోని టైర్2, టైర్3 సిటీలలో వస్తున్న వేగమైన గ్రోత్ కారణంగా మన ఆన్లైన్ రిటెయిల్ మార్కెట్ 2030 నాటికి 325 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.26 లక్షల కోట్లు) చేరుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. 2022 లో ఆన్లైన్ రిటెయిల్ మార్కెట్ సైజు 70 బిలియన్ డాలర్లని డెలాయిట్ ఇండియా ఈ రిపోర్టులో పేర్కొంది. రాబోయే పదేళ్ల కాలంలో ఆఫ్లైన్ రిటెయిల్తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ (2.5 రెట్లు) వేగంతో ఆన్లైన్ రిటెయిల్ మార్కెట్ ఎదుగుతుందని అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే మూడో పెద్ద కన్జూమర్ మార్కెట్గా ఇండియా శరవేగంతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఆఫ్ రిటెయిల్ పేరుతో ఒక రిపోర్టును డెలాయిట్ తీసుకొచ్చింది.
ఆన్లైన్ ఆర్డర్ల సంఖ్యలో టైర్2, టైర్ 3 సిటీలు ఇప్పటికే టైర్1 సిటీలను దాటేశాయి. రాబోయే పదేళ్లలో ఈ జోరు మరింత ఎక్కువవుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ రిటెయిల్ బిజినెస్ 325 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ వివరించింది. 2022 లో టైర్2, టైర్ 3 సిటీల నుంచి ఆర్డర్లు మొత్తం ఆర్డర్లలో 60 శాతానికి చేరాయి. మొత్తం ఆర్డర్ల వాల్యూమ్ ఆ ఏడాదిలో టైర్3 సిటీల వాటా 65 శాతం పెరిగితే, టైర్2 సిటీల ఆర్డర్ల వాల్యూమ్ 50 శాతం పెరిగినట్లు డెలాయిట్ రిపోర్టు తెలిపింది.
ఆన్లైన్ జోరెందుకు...
ఆన్లైన్ రిటెయిల్ దేశంలో వేగంగా ఎదగడానికి చాలా కారణాలనున్నాయని డెలాయిట్ ఈ రిపోర్టులో వెల్లడించింది. ఆర్డర్లు ఇవ్వడంతోపాటు, రిటర్న్లలోనూ సులభత్వం, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగయి 19 వేల పిన్కోడ్స్కు చేరుకోగలగడం వంటివి ప్రధానమైనవని వివరించింది. దేశంలో డిజిటల్ ఇష్టపడే కన్జూమర్ల సంఖ్య ఎక్కువవుతోందని, 220 మిలియన్ల మంది ఆన్లైన్ షాపర్లు ఉన్నారని చెబుతూ, దీంతో ఈ–కామర్స్ (ఆన్లైన్ బిజినెస్) మరింత ఊపందుకుంటోందని తెలిపింది.
ఏఆర్, వీఆర్లతో మారుతున్న కస్టమర్ ఎక్స్పీరియన్స్..
టైర్ 2 సిటీలలో ఇంటర్నెట్ దూసుకెళ్తుండటంతో పాటు, ఆన్లైన్ బిజినెస్ల ఏర్పాటు ఈజీ కావడం, ప్రభుత్వ సపోర్టు, కన్వీనియెన్స్, కావాల్సిన వస్తువులను ఈజీగా కనుక్కోవడానికి వీలు, పేమెంట్స్సులభమవడం ....ఈ అంశాలన్నీ కలిసి దేశంలోని రిటెయిల్ ల్యాండ్స్కేప్నే మార్చి వేయనున్నాయని డెలాయిట్ ఈ రిపోర్టులో వివరించింది. ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్) , మెటావర్స్ వంటి కొత్త టెక్నాలజీలతో కస్టమర్ ఎక్స్పీరియన్స్లో పెను మార్పులు వస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. పెద్ద రిటెయిల్ ఎకో సిస్టమ్లో భాగం కిరాణా షాపులను ఇంటిగ్రేట్ చేస్తే కొత్త మార్కెట్లకు ఛాన్స్ వస్తుందని, ప్రొడక్ట్ రేంజ్ పెంచుకోవడంతోపాటు, తమ బిజినెస్ను పెంచుకునే అవకాశం పెద్ద కంపెనీలకు కలుగుతుందని తెలిపింది.
ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులూ....
ఆన్లైన్ రిటెయిల్ బిజినెస్లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ సంస్థల పెట్టుబడులు సైతం బాగా పెరుగుతున్నాయి. గత అయిదేళ్లలో చూస్తే ఈ పెట్టుబడులు 23 బిలియన్ డాలర్లకు చేరాయని డెలాయిట్ రిపోర్టు చెబుతోంది. ఆర్గనైజ్డ్ రిటెయిల్సెగ్మెంట్ను త్వరలోనే ఆన్లైన్ రిటెయిల్ దాటేస్తుందని పేర్కొంటూ, పెద్ద కంపెనీలన్నీ తమ ఆన్లైన్, ఆఫ్లైన్ బిజినెస్లను ఇంటిగ్రేట్ చేసుకోవల్సి వస్తుందని వివరించింది. అప్పుడే కన్జూమర్లకు మెరుగైన సేవలను అందించగలుగుతాయని తెలిపింది.
ఇండియాలో రిటెయిల్ సెక్టార్ ఎదుగుదల చాలా ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. మిడిల్ క్లాస్ సంఖ్యా ఎక్కువవుతోంది. డిజిటైజేషన్ చాలా వేగంగా సాగుతోంది. టెక్నాలజీ పవర్ను సరిగ్గా వాడుకోవడం వల్ల నిలకడయిన వ్యూహాలతో ఒక ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేసుకునే అవకాశం రిటెయిలర్లకు కలుగుతోంది. కన్జూమర్ల డిమాండ్స్ నెరవేర్చడంతోపాటు, కొత్త బెంచ్మార్కులను సాధించడానికీ ఎకో సిస్టమ్ వీలు కల్పిస్తుంది.
- ఆనంద్ రామనాథన్, పార్ట్నర్, డెలాయిట్ ఇండియా