న్యూఢిల్లీ: నార్వే పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన నార్వే మహిళా జర్నలిస్ట్ హెలె లింగ్కు ఇండియా కౌంటర్ ఇచ్చింది. భారత్పై ఆమెకు కనీస అవగాహన లేదని.. ఏవో పనికిమాలిన ఛానెళ్లు, ఎన్జీవోలు ప్రచురించే ఒకటి రెండు వార్తలు చూసి అర్ధంపర్ధం లేని ప్రశ్నలు అడుగుతుంటారని విమర్శించింది. భారత్లో ఉన్న పత్రిక స్వేచ్ఛ మరెక్కడా లేదని పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కల్పించిందని, హక్కుల ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే చట్టపరమైన రక్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మార్చే ఓటు హక్కు ప్రజలకు ఉండటమే దేశంలో మానవ హక్కులకు అతిపెద్ద ఉదాహరణ అని అభివర్ణించారు.
అసలేం జరిగిందంటే..?
ప్రధాని మోడీ 2026, మే 18న నార్వేలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓస్లోలో నార్వే ప్రధానితో ప్రధాని మోడీ జాయింట్ ప్రెస్ స్టేట్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నార్వే మహిళా జర్నలిస్ట్ హెలె లింగ్ ప్రధాని మోడీని ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి వచ్చిన మీరు కొన్ని ప్రశ్నలు ఎందుకు తీసుకోరని ఆమె ప్రశ్నించారు. కానీ ప్రధాని మోడీ ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.
దీంతో ఆమె భారత పత్రిక స్వేచ్ఛ గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శనాత్మకంగా ట్వీట్ చేశారు. ఈ ఇష్యూ వైరల్గా మారడంతో నార్వేలోని భారత ఎంబసీ ఆమెను అధికారిక విదేశాంగ శాఖ ప్రెస్ బ్రీఫింగ్కు ఆహ్వానించింది. ఈ ప్రెస్ మీట్లో కూడా ఆమె భారత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుంటే మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.
►ALOS READ | మహా రక్తపాతం సృష్టిస్తం: అమెరికాకు క్యూబా మాస్ వార్నింగ్
ఈ క్రమంలో హెలె లింగ్ ప్రశ్నలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ (వెస్ట్) సీబీ జార్జ్ తీవ్రంగా తిప్పికొట్టారు. కొందరు వ్యక్తులు ఊరుపేరు లేని మీడియా ఛానెళ్లు, అజ్ఞాన ఎన్జీవోలు ప్రచురించిన అసత్య కథనాలు చదివి ఇలాంటి అర్ధంలేని ప్రశ్నలు అడుగుతుంటారని కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలు అడిగే వారికి భారతదేశ విస్తృతి, వైవిధ్యం గురించి కనీస అవగాహన లేదని విమర్శించారు. ఇక్కడ ఎన్ని ఛానెళ్లు ఉన్నాయో.. ఎన్నో వార్తలు వస్తాయో తెలియదు.
కానీ ఒక్క ఢిల్లీలోనే ఇంగ్లీష్, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కనీసం 200 వరకు టీవీ ఛానెళ్లు నిరంతరం వార్తలను అందిస్తున్నాయని, అంత పెద్ద మీడియా వ్యవస్థ మరెక్కడా లేదని గుర్తుచేశారు. 1947 నుంచే మహిళలకు సమాన ఓటు హక్కు కల్పించిన ఘనత ఇండియాదని.. భారత్లో ప్రభుత్వాన్ని మార్చే ఓటు హక్కు ప్రజలకు ఉండటమే మానవ హక్కులకు అతిపెద్ద ఉదాహరణ అని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి బలంగా వినిపించారు.
