
- మండల అధ్యక్షుల ఎంపిక ఎందుకు పూర్తి చేయలె
- ఇద్దరు ఎమ్మెల్యేలపై మీనాక్షి నటరాజన్ అసహనం
హైదరాబాద్, వెలుగు: పార్టీ మండల అధ్యక్షుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం గాంధీ భవన్లో 10 ఉమ్మడి జిల్లాల వారీగా పీసీసీ అబ్జర్వర్లు, కో ఆబ్జర్వర్లతో సమావేశమయ్యారు. మండల అధ్యక్షుల ఎంపిక ఎంత వరకు వచ్చింది, పార్టీ బలోపేతం, ప్రభుత్వ స్కీమ్లు, అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారా.. ఏవైనా సమస్యలు ఉన్నాయా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
మండల అధ్యక్షుల ప్రతిపాదన లిస్టును పీసీసీ అబ్జర్వర్లు రెడీ చేసి మీనాక్షికి అందజేశారు. ఒక్కో మండల అధ్యక్ష పదవికి మూడు పేర్లను ప్రతిపాదించారు. కాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మండల అధ్యక్షులను ఎంపిక చేయలేదని, మీనాక్షికి అబ్జర్వర్లు ఫిర్యాదు చేయగా, వెంటనే ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎందుకు ఎంపిక చేయలేదని కారణాలు అడిగినట్లు నేతలు చెబుతున్నారు. ఈ ప్రాసెస్ వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను మీనాక్షి నటరాజన్ ఆదేశించినట్లు సమాచారం.