నటి, దర్శక నిర్మాత విజయనిర్మల మరణం తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. దర్శక నటీమణి శ్రీమతి విజయ నిర్మల గారి హఠాన్మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. తెలుగు పరిశ్రమలో భానుమతి గారి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల గారని, . బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారని అన్నారు.
అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేమని చిరు అన్నారు. కృష్ణగారికి జీవిత భాగస్వామినిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారని ఆయన తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆమె మరణం తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణగారికి, నరేష్ కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చిరంజీవి తెలిపారు.