
- ప్రారంభమైన మహా శివరాత్రి వేడుకలు
- మూట, ముల్లెలతో తరలివస్తున్న లక్షలాది భక్తులు
- శివన్నామ స్మరణతో మార్మోగుతున్న రాజన్న సన్నిధి
- లైటింగ్తో టెంపుల్ ధగధగలు
- టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
మహాశివరాత్రి కోసం ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. వేములవాడ రాజన్న, కీసరగుట్ట, ఇందూరు నీలకంఠేశ్వర, కొమురెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వేములవాడలో మూడురోజుల జాతర సోమవారం మొదలైంది. మంగళవారం శివరాత్రి సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీగా వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శివరాత్రి పూజల కోసం లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. మూట ముల్లెలతో అంతా ఎములాడ బాటే పడుతున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో వారి కోసం రాజన్న ఆలయంతో పాటు గుడి చెరువు ఏరియాలో చలువ పందిళ్లు వేశారు. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ట్రాన్స్పోర్టేషన్ వంటి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. లైటింగ్తో గుడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ధగధగలాడుతున్నాయి. గుడి చెరువులోనే ప్రధాన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సోమవారం వీటికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం తరుపున ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార స్టాల్ను ఈఓ రమాదేవి ప్రారంభించారు. అలాగే తిప్పాపూర్బస్టాండ్ నుంచి రాజన్న గుడి చెరువు పార్కింగ్ వరకు నడిపేందుకు 14 ఫ్రీ బస్సులను ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ అరుణ జెండా ఊపి ప్రారంభించారు. భక్తులకు ఏదైనా సమస్య తలెత్తితే ఫోన్ చేయడానికి ఆఫీసర్లు టోల్ఫ్రీ నంబర్ 1800 425 2038 ఏర్పాటు చేశారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం
మహా శివరాత్రి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రత్యేక దర్శనాలు కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు స్థానికులకు, 3 గంటల నుంచి 3:30 వరకు కౌన్సిలర్లకు సర్వ దర్శనం ఏర్పాటు చేశారు. 3:45 గంటల నుంచి 4:15 వరకు సుప్రభాత సేవ, 4:15 నుంచి 4:30 వరకు ఆలయ శుద్ది, 4:30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ చేసి అనువంశిక అర్చకులకు దర్శనం కల్పించనున్నారు. 8 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం, 8.30 గంటలకు రాష్ర్ట ప్రభుత్వం తరపున మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివ దీక్ష చేపట్టిన స్వాముల దర్శనానికి అవకాశం కల్పించారు. 6:05 గంటల నుంచి 8 :30 గంటల వరకు స్వామి వారి కల్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే భక్తులకు భీమేశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు.
పుట్టలో బయటపడ్డ శివలింగం!
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో పుట్టను తవ్వుతుండగా శివలింగం బయటపడింది. ప్రముఖ ముఖ్యనాథుని(త్రికుటాలయం) ఆలయ ప్రాంగణంలో భక్తుడు ప్రవీణ్ సోమవారం మట్టి కోసం కోసం పుట్టను తవ్వుతున్నాడు. ఏదో తాకినట్టు అనిపించడంతో ఆపి చూడగా శివలింగం కనిపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఊర్ల జనాలు భారీగా తరలివచ్చారు. ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నేండ్లుగా మూసి ఉంది. నాలుగు నెలల నుంచే ఓపెన్ చేసి, పూజలు చేస్తున్నారు.
నేడు కొమురవెల్లిలో పెద్దపట్నం
కొమురవెల్లి: కొమురవెల్లిలో మల్లన్నకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పాటు నిరంతరం అభిషేకాలు చేయనున్నారు. తోట బావి ప్రాంగణంలో పెద్దపట్నం వేసి స్వామివారికి కల్యాణం నిర్వహించనున్నారు. దీని కోసం ఈఓ బాలాజీ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మల్లన్న వీరశైవుల ఆడబిడ్డ మేడలాదేవితో పాటు యాదవుల ఆడపడుచైన గొల్లకేతమ్మను పెండ్లాడారు. అందుకే స్వామివారు ఇక్కడ రెండు రకాలుగా పూజలందుకుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వీరశైవులు వేద మంత్రోచ్చారణలతో కళ్యాణం జరపగా, యాదవ పూజారులు తమ ఆచారం ప్రకారం 48 వరుసల్లో పట్నం వేసి కల్యాణం నిర్వహించనున్నారు.
యాదాద్రిలో ఘనంగా కల్యాణం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి(బాలశివాలయం) టెంపుల్లో మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రుద్రహవనం కైంకర్యం, రాత్రి కల్యాణం నిర్వహించారు. మంగళవారం అభిషేకాలు జరపనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం చేయనున్నారు. అభిషేకం టికెట్ ధర రూ.250, శతరుద్రాభిషేకం టికెట్ ధర రూ.516 గా నిర్ణయించారు. కొవిడ్ దృష్ట్యా ఒక టికెట్ పై ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు .