
జనగామ: కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చెబుతోందని, కానీ కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆరెఎస్ పార్టీ అధినేత సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతులు, పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం దిగివచ్చి వడ్లు కొనే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని నినదించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. తమని నూకలు తినాలన్న బీజేపీ నాయకులకే నూకలు బుక్కిద్దామని చెప్పారు. కేంద్రంతో వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలను ఓ రకంగా మిగతా రాష్ట్రాలను మరో రకంగా చూస్తోందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో సాగు పెరిగిందని, దీంతో రైతులు పెద్ద ఎత్తున వరిని పండించారన్నారు. కానీ కేంద్రం వడ్లు కొనబోమని తేల్చి చెప్పడంతో రాష్ట్ర రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. దమ్ముంటే బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంతో వడ్లు కొనిపించాలని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ను పావుగా వాడుకుంటోందని, కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని వార్తల కోసం..