ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన ధనవంతులు

ఈరోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన ధనవంతులు

టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి హరీష్ 

ఈరోజుల్లో ఆస్తి, ఐశ్వర్యం ఉన్నవారు ధనవంతులు కాదని, ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన ధనవంతులు అని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. చాలామంది పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అవసరం ఉన్నా, లేకున్నా డాక్టర్లు మందులు రాయకూడదని, అనవసర మందులు వాడటం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే పని వల్ల అందరికీ చెడ్డ పేరు రావొద్దని, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ద్వారా తాము మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్స్ ఆఫ్ ద హెల్త్ కేర్ 2022 పేరిట వైద్యులను సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరికరాలు, మిషన్లు అందుబాటులో ఉంచడంతో పాటు సకాలంలో వాటిని మరమ్మతులు చేసేలా PMU ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయని వివరించారు. 2014లో 570 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను1000 దాకా పెంచామన్నారు. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి తక్కువ ధరకే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఇవాళ వాక్సిన్ల హబ్ గా హైదరాబాద్ ఎదిగిందన్నారు. అవార్డులు అందుకున్న వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియజేశారు. 

ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలో స్పెషలైజ్డ్ నర్సింగ్ స్కూల్ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 33 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు 66 శాతానికి పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశబడ్జెట్ లో ఆరోగ్య రంగానికి 1.1 శాతం నిధులు కేటాయిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాష్ర్ట బడ్జెట్ లో 4.5 శాతం నిధులు కేటాయించిందని చెప్పారు. ఒకప్పుడు ‘మంచం పట్టిన పల్లెలు’ అని చదువుకునే వాళ్లమని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు పల్లెల్లో లేవన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ది చేసిన నీటిని ఇంటింటికి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం కావడం వల్ల సీజనల్ వ్యాధులు చాలావరకూ తగ్గాయన్నారు.

స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ..అరోగ్య తెలంగాణగా అవతరించిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. గడిచిన ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వైద్య, ఆరోగ్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలు, సంస్కరణల కారణంగా ఫార్మా, మెడికల్ రంగాల్లో దేశానికి తెలంగాణ హబ్ గా మారిందన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతులను, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను ఎప్పటికీ మర్చిపోకూడదని, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న వైద్యులను సత్కరించడం గొప్ప విషయం అన్నారు.