కేంద్రం తప్పులు చేస్తూ... రాష్ట్రాలను బద్నాం చేస్తోంది

కేంద్రం తప్పులు చేస్తూ... రాష్ట్రాలను బద్నాం చేస్తోంది
  • కేంద్ర తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
  • వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో కేంద్రం ఫెయిల్
  • టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది
  • హైరిస్క్ గ్రూపులకు మొదటగా వ్యాక్సినేషన్
  • వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి
  • మీడియాతో ఆర్థికమంత్రి హరీష్ రావు


వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు విదేశాల నుంచి వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంటుంటే.. 
మన దేశంలో మాత్రం ఇక్కడే ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు లేకుండా విదేశాలకు పంపిన ఘనత కేంద్రానిదని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ గ్రూపులకు ఇస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

‘ప్రపంచంలో జనాభా పరంగా రెండవ పెద్ద దేశమైన భారత దేశంలో.. ఇక్కడ ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ దేశ ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు సరఫరా చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారిస్తోంది. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదు. పైగా.. కంపెనీలు, ఇతర దేశాల నుంచి రాష్ట్రాలను దిగుమతి కూడా చేసుకోనివ్వడంలేదు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను కూడా కంపెనీల నుంచి కొనుక్కునే పరిస్థితి లేకుండా కేంద్రం చేసింది. కేంద్రం తప్పుల మీద తప్పులు చేస్తూ... రాష్ట్రాలను బద్నాం చేస్తోంది. వ్యాక్సిన్లను సకాలంలో పంపిణీ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయింది. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రం తమ తప్పుడు నిర్ణయాలను మరోసారి సమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యాక్సినేషన్ దిగుమతిని సరళతరం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలే హై రిస్క్ గ్రూప్‌ల ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలి. అన్ని రకాల వాక్సిన్లను అన్ని కంపెనీల నుంచి, దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చింది. రాష్ట్రాలకు ఎన్ని వ్యాక్సిన్లు ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేకపోతున్నాయి.

తెలంగాణలో హై రిస్క్ గ్రూపులతో పాటు ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 13 నగర పాలక సంస్థలు, 129 మున్సిపాలిటీల పరిధిలోని కూరగాయలు, పండ్ల విక్రేతలు, మద్యం విక్రేతలు, హోటళ్లలో పనిచేసే వ్యక్తులు, స్మశాన వాటికల్లో పనిచేసే వ్యక్తులు, కిరాణా షాపులలో పనిచేసే వ్యక్తులు మొదలైన 8 లక్షల 50 వేల మందికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. నేటి నుంచి 10 రోజుల పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతుంది. ప్రాధాన్యత క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే వ్యక్తులకు వ్యాక్సినేషన్ ఇస్తాం. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా కట్టడికి నిర్వహించిన ఇంటింటా కోవిడ్ సర్వే, లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది. మూడో వేవ్ కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వ సన్నద్ధంగా ఉంది. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి అధికారులను పురమాయించారు. హై రిస్క్ గ్రూపులు తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నాలుగే నాలుగు మందులు. అవేంటంటే.. వ్యాక్సినేషన్, ఐసోలేషన్, మాస్క్, భౌతిక దూరం. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడ మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.