
Jyotiraditya Scindia: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్ చాలా కాలంగా భారతదేశంలో తన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత భారత నియమనిబంధనలకు అనుగుణంగా అనుమతులను అందుకుంది. ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించటానికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేసిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఆయన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ లైసెన్స్ జారీ విషయాన్ని ధృవీకరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో డిజిటల్ ఇండియా దిశగా వేస్తున్న అడుగులకు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని అన్నారు. స్టార్ లింక్ సేవలను ప్రారంభించటానికి అనుమతులు రావటంతో శుభ ప్రయాణానికి అడుగులుపడ్డాయని స్పేస్ ఎక్స్ సీఓఓ గ్విన్నే షాట్వెల్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం స్టార్ లింక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉపగ్రహాల ఆధారంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా మారుమాల ప్రాంతాల్లో సైతం అంతర్జాల సేవలను అందుబాటులోకి తీసుకురావటం దేశంలోని సుదూర ప్రాంతాల ప్రజలను సైతం మిగిలిన ప్రపంచానికి కనెక్ట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్ టెల్ స్టార్ లింక్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Had a productive meeting with Ms. @Gwynne_Shotwell, President & COO of @SpaceX, on India’s next frontier in connectivity. We delved into opportunities for collaboration in satellite communications to power Digital India’s soaring ambitions and empower every citizen across the… pic.twitter.com/gGiCLC5e1C
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 17, 2025
శాటిలైట్ ఆధారంగా ఇంటర్నెట్ సేవలను అందించటానికి భారతదేశంలో లైసెన్స్ పొందిన మూడవ సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. దీనికి ముందు జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్ టెల్ కి చెందిన వన్ వెబ్ సంస్థలు ఇదే తరహా లైసెన్సులను టెలికాం డిపార్ట్మెంట్ నుంచి పొందాయి. అయితే అమెరికాకు చెందిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కుయిపర్ ఇప్పటికీ భారత ప్రభుత్వం నుంచి ఆమోదం కోసం వేచి చూస్తోంది.