- ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని కేంద్రం యోచన
- రాహుల్తో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ
- సభ సజావుగా జరిగేలా సహకరించాలని వినతి
- విరాళాల చోరీ, విద్యార్థుల కేసులపై అమిత్ షా నోరు విప్పాల్సిందే
- అప్పటిదాకా సభ జరగనివ్వమన్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనను ప్రతిపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుంచింది. పార్టీలో, ఇతర ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని కాంగ్రెస్ వెల్లడించింది. గత ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని ప్రభుత్వం సాధించలేకపోయింది. అప్పటి ఓటింగ్లో 528 మంది ఎంపీలు పాల్గొనగా.. 352 ఓట్లు అవసరమయ్యాయి. అయితే, సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి వచ్చిన ఎంపీలతో ఎన్డీయే కూటమి బలం పెరిగింది. దీంతో ఈసారి బిల్లును పాస్ చేయించుకోవాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్సభలో నిరసనల హోరును తగ్గించి, సభా కార్యక్రమాలను గాడిలో పెట్టేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన రాయబారం ఫలించలేదు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కీలక బిల్లులకు మద్దతు కోరగా.. సానుకూల స్పందన లభించలేదు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన వెలువడేవరకు సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగబోవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
50 నిమిషాల భేటీ.. హాజరైన ముఖ్య నేతలు
బుధవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్ది
నిమిషాల్లోనే ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ వాయిదా పడింది. ఆ వెంటనే కిరణ్ రిజిజు పార్లమెంట్ ఆవరణలోని రాహుల్ గాంధీ చాంబర్కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, లోక్సభ కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తిరిగి తీసుకురావాలని భావిస్తున్న డీ లిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులకు కాంగ్రెస్ తరఫున మద్దతు ఇవ్వాలని రిజిజు కోరారు. గత బడ్జెట్ సమావేశాల్లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేక ఆగిపోయిన డీలిమిటేషన్ బిల్లును, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన బలం ఆధారంగా ఈసారి నెగ్గించుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ వ్యూహానికి రాహుల్ ‘నో’ అంటూ బ్రేక్ వేశారు. కాగా, రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన వెంటనే మంత్రి కిరణ్ రిజిజు నేరుగా స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. సభలో నెలకొన్న ప్రతిష్టంభనను ఎలా అధిగమించాలనే దానిపై చర్చించారు. మరోవైపు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో సహా ఇతర ప్రతిపక్ష నేతలతోనూ చర్చలు జరిపేందుకు రిజిజు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
చర్చలు లేవు.. ప్రశ్నోత్తరాలు లేవు
వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి లోక్సభలో ఒక్క రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగలేదు. సభ ప్రారంభం కావడమే ఆలస్యం ప్రతిపక్షాలు ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్లడం, స్లోగన్స్తో హోరెత్తించడంతో ప్రతిరోజూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభలో నిరసనల హోరు కొనసాగుతున్నప్పటికీ, ఎలాంటి చర్చా లేకుండానే ప్రభుత్వం ఇప్పటివరకు 5 కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంది. అయితే, ప్రతిపక్షాల పట్టుదలతో ఈ సమావేశాలు ముగిసే ఆగస్టు 13 నాటికి డీలిమిటేషన్ బిల్లును గట్టెక్కించడం కేంద్రానికి సవాల్గా మారింది.
