అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 
  •     రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. మంగళవారం సెక్రటేరియట్ లో నల్గొండ పట్టణ రింగ్ రోడ్డుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధిలో రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుందని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు, ప్లాట్ ఓనర్స్ ముందుకొచ్చారని తెలిపారు.

వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. పానగల్, కొత్తపల్లి, అర్జల్ బావి, మర్రిగూడ ప్రాంతాల్లో భూసేకరణ పూర్తయిందని తెలిపారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా నల్గొండ అభివృద్ధే తన మొదటి కర్తవ్యమన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎన్ హెచ్ఐఏ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్, ఆర్డీవో అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు పీఎస్ చంద్రమోహన్, ధర్మారెడ్డి, మురళి తదితరులు
 పాల్గొన్నారు.