
- గతంలో జరిగిన తప్పులు రిపీట్ కావొద్దు
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రీనరీ పెంచే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హరితహారంపై ఇప్పటి దాకా జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సెక్రటేరియెట్లో ఫారెస్ట్, రూరల్ డెవలప్ మెంట్, మున్సిపల్, జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ ఆఫీసర్లతో ఆమె రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాలన్నారు.
ఇంటి అవసరాలకు, కనీస ఆదాయాన్నిచ్చే మొక్కలు పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పూలు, పండ్ల జాతుల మొక్కల పంపిణీతో పాటు, స్వచ్ఛందంగా పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇంటి ఆవరణలో చెట్లు నాటుకున్న వాళ్లకు కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. చింత, సీతాఫల్, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు లాంటి మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
హరితహారం కార్యక్రమం పారదర్శకంగా.. పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన తప్పులు సవరించుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నాటుతున్న మొక్కలు, వాటి ఎదుగుదల, చనిపోయిన మొక్కలను మార్చే విధానం అన్ని కూడా వీలైనంత త్వరగా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫారెస్ట్ అధికారులపై దాడిని ఖండిస్తున్నం
భద్రాద్రి జిల్లా ఇల్లెందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలోని అటవీ శాఖ అధికారులపై ఇసుక మాఫియా దాడిని మంత్రి కొండా సురేఖ ఖండించారు. అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రవాణాను ఆపేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై ట్రాక్టర్ ఎక్కించి చంపేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు మంత్రి ఫోన్ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి దాడులకు చోటు లేదన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.