
జూలైలో సాధారణం కంటే 450 శాతం ఎక్కువగా వర్షపాతo నమోదైందని రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ లో అసాధారణ పరిస్థితులు లేవని.. అయినా ఉదాసీనంగా, అలక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఆస్తి నష్టం తగ్గే విధంగా చూడాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాల్టీలతో సహా అన్ని గ్రామాల్లో సేఫ్టీ అడిట్ జరగే విధంగా చూడాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సి వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ zpp చైర్ పర్సన్, మున్సిపల్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వరుణుడి బీభత్సం తొలగలేదు. భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలపై ఎఫెక్ట్ పడింది. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వర ఆలయం చుట్టూ ...భారీగా వరద నీరు చేరింది. దీంతో.. గుడి దగ్గరున్న 20 మంది వరదల్లో చిక్కుకున్నారు. పూజారుల కుటుంబ సభ్యులు 17మంది, మరో ముగ్గురు చేపల వేటగాళ్లు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.