తెలంగాణలో కరెంట్ కోతలు లేవు  : కేటీఆర్

తెలంగాణలో కరెంట్ కోతలు లేవు  : కేటీఆర్

తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్నదాతల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాక ముందు కరెంట్ కోతలు, ఛార్జీల మోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువగా జరిగేవన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలోనే వరి ధాన్యం పండించడంలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటిలోని మన్నెగూడలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 

తెలంగాణలో కరెంట్ కోతలు లేవని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో వ్యవసాయానికి  ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్నారు. 2014లో  రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు ఉంటే..ఇప్పుడు మూడున్నర కోట్ల టన్నుల వరకు ధాన్యం ఉత్పత్తి  అవుతోందన్నారు. రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింద 58వేల కోట్ల రూపాయలను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడికే 18వేల కోట్ల కాంట్రాక్టును కేంద్రం ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. అదే డబ్బును నల్లగొండ జిల్లా అభివృద్దికి కేటాయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినా బీజేపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.   

మోటార్లకు మీటర్లు పెడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి లోన్లు ఇస్తామని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, దానికి  సీఎం కేసీఆర్ ఒప్పుకోవడం లేదన్నారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేస్తే నష్టం వస్తుందని..దాన్నికూడా ప్రైవేటుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అలా చేస్తే రైతులకు కనీస మద్దతు ధర కూడా రాదన్నారు. యాసంగి వడ్లు కొనమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను అడిగితే .. రైతులకు నూకలు తినడం నేర్పించాలని అమర్యాదగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.