తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి..గల్ఫ్ పారిశ్రామిక వేత్తలు, ఎన్నారైలను కోరిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు

తెలంగాణలో  పెట్టుబడులు పెట్టండి..గల్ఫ్ పారిశ్రామిక వేత్తలు, ఎన్నారైలను కోరిన మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు
  • రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపు
  • దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 5 శాతంకన్నా ఎక్కువేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:రైజింగ్ తెలంగాణలో భాగస్వాములు కావాలని గల్ఫ్ పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్  వీకెండ్​– దుబాయి 2025లో భాగంగా యూఏఈలో నిర్వహించిన సౌత్ ఇండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డు(సైబా)ల ప్రదానోత్సవానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. 

విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజా వివేకానంద్‌‌కు సౌత్ ఇండియా బిజినెస్ అచీవర్స్​ అవార్డును మంత్రి శ్రీధర్ బాబు అందజేసి మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌‌‌‌గా నిలుస్తున్న తెలంగాణ 
పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణ పరంగా 11, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. అయినా దేశ జీడీపీలో మా వాటా 5 శాతం కంటే ఎక్కువే. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌‌‌‌డీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. 

ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. గత 18 నెలల్లో తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఈవీ, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఏఐ, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో రూ.3.28 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. ఎలీ లిల్లీ లాంటి అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణను తమ గమ్యస్థానంగా మార్చుకున్నాయి. ఇప్పటికే యూఏఈ పెట్టుబడిదారులు రూ.2 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. ఇది తెలంగాణ దుబాయ్ మధ్య రోజురోజుకీ బలపడుతున్న వాణిజ్య సంబంధాలకు చిహ్నంగా భావిస్తున్నాం’’ అని చెప్పారు. 

ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారవేత్తలుగానే చూడట్లేదని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తున్నామని శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు తెలిపారు. ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌‌‌‌టెక్, డిజిటల్ ఎకానమీ, స్మార్ట్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈవీ, ఏరో స్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని, తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.