హైదరాబాద్: తెలంగాణాలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. తె లంగాణా విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇంటర్నిషిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్ధుల అభివృద్ధి అనే అంశంపై డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ అటు విద్యలో మరో వైపు ఐటీలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, దీన్ని మరింత అందిపుచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో అభ్యసించే ఏ విద్యార్ధి కూడా నైపుణ్యం లేకుండా ఉపాధి అవకాశాలు కోల్పోరాదని ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, తెలంగాణ విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు.
డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్ధులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్నిషిప్ పొందేలా చర్యలు చేపట్టాలన్నారు శ్రీధర్ బాబు. తద్వారా విద్యార్ధికి పరిశ్రమలతో అనుసంధానం ఏర్పడి ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. పరిశ్రమలకు కావాల్సిన రీతిలో విధ్యార్ధులను తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్ లో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఉన్నాయని ఆయా బహుళజాతీ సంస్థలు, ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వంతో అవగాహణ ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతం నుంచి మరింత మంది ఉపాధి పొందడానికి ఇది దోహద పదనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణా ఉన్నత విద్యా మండలి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూనే అటు ప్రభుత్వంతో ఇటు పారిశ్రామిక సంస్థలతో కో ఆర్డినేషన్ కోసం ఓ ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి విద్యా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
