- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మెహిదీపట్నం/సికింద్రాబాద్/పద్మారావునగర్,వెలుగు: హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీలు ప్రతి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన ఆఫీసులో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధిపై రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్తో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన నేపథ్యంలో చాలామంది స్టూడెంట్లు, నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. ఇందులో భాగంగా అన్ని లైబ్రరీల్లో న్యూస్ పేపర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 20 ప్రధాన లైబ్రరీల్లో స్టడీ మెటీరియల్ ఉందన్నారు.అవసరం మేరకు లైబ్రరీల వద్ద రూ. 5 భోజన కేంద్రాలైన అన్నపూర్ణ క్యాంటీన్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే 4 నెలల్లో లైబ్రరీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 82 లైబ్రరీలు ఉండగా, వాటిలో కొన్ని బిల్డింగ్లకు సంబంధించి అభివృద్ధి, నిర్మాణ పనులు ఇప్పటికే చేపట్టామన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ సెక్రటరీ పద్మజ, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
28 మందికి దళిత బంధు
వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో దళిత బంధు స్కీమ్ కింద 28 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్ శర్మన్ వెహికల్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత బంధు కింద తీసుకున్న వెహికల్స్ను లబ్ధిదారులు ఇతరులకు అమ్మాలని చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిల్లలను సర్కారు బడికి పంపించాలె
తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడికే పంపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. భోలక్పూర్లోని మేకలమండి ప్రభుత్వ స్కూల్లో బుధవారం బడి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బడి బాటకు సంబంధించిన ఫ్లెక్సీ, పాంప్లెంట్లను రిలీజ్ చేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తూ.. స్టూడెంట్ల సంఖ్య పెంచేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ‘మన బడి– మన బస్తీ’ ప్రోగ్రామ్లో భాగంగా సనత్నగర్లోని అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్న మేకలమండి ప్రభుత్వ స్కూల్ టీచర్లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మల్లికార్జున రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.
మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) June 8, 2022
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇకనుండి గ్రంధాలయాలు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. pic.twitter.com/w4wn2EcjLa