
- గోదావరిపై ప్రాజెక్ట్ కడితే బనకచర్ల వివాదం ఉండేదే కాదు
- మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్య
పాలకవీడు/మేళ్లచెర్వు/హుజూర్నగర్, వెలుగు : హరీశ్రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన తన పేరును గోబెల్స్ రావుగా మార్చుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేలా తాము పోరాటం చేస్తుంటే... గత పాలకులు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ సమీపంలో కృష్ణా నదిపై రూ.302 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ జాన్పహాడ్ లిఫ్ట్ పనులను శుక్రవారం పరిశీలించారు.
అనంతరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ శంకర్నాయక్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో గోదావరి నదిపై దేవాదుల, సీతారామ, సీతమ్మధార, సమ్మక్క సారక్క, గౌరవెల్లి, తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్ట్లు కట్టి ఉంటే బనకచర్ల వివాదం ఉండేదే కాదన్నారు.
ఈ ప్రాజెక్ట్లు కట్టకపోవడంతో గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ బనకచర్లను తెరమీదకు తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ను పూర్తి చేస్తే రూ.38 వేల కోట్లతో పూర్తై 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదనని, మిగిలిన రూ.62 వేల కోట్లతో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను రైతుల ప్రయోజనం కోసం కాకుండా... కమీషన్ల కోసం నిర్మించారని ఆరోపించారు.
కాళేశ్వరం కోసం తెచ్చిన రూ.లక్ష కోట్ల అప్పుకు ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే గత ఖరీఫ్, రబీ సీజన్ కలిపి 281 లక్షల టన్నుల వడ్లు పండాయని, అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందన్నారు. గత ప్రభుత్వం పదేండ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను పట్టించుకోలేదన్నారు. కృష్ణ, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్ట్ల పనులను స్పీడప్ చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఎస్పీ నరసింహ, ఇరిగేషన్ ఎస్ఈ రమేశ్ ఉన్నారు.