హైదరాబాద్, వెలుగు : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జలసౌధలో జరిగిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుల పనులల్లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. వాటన్నింటిని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. భీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, దేవాదుల, పాలమూరు- రంగారెడ్డి, నారాయణపేట- కొడంగల్, చిన్న కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్ ఫో కెనాల్, మొడికుంటవాడు, చనాకా కొరాటా, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రాధాన్య జాబితాలో తీసుకొని పనులు పూర్తి చేయాని స్పష్టం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి భీం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

