
కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అప్పట్లో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ మీటింగ్ కు హాజరైన ఉత్తమ్.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చించామని చెప్పారు. సోమవారం ఇంజినీర్ల స్థాయిలో చర్చలు ఉంటాయన్నారు. ఎన్డీఎస్ ఏలో కాళేశ్వరంపై చర్చించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును నీళ్లు లేవనే కారణంతో మేడిగడ్డ దగ్గర కట్టారన్నారు ఉత్తమ్. తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే ఇంకోలా ఉండేదని చెప్పారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను ప్రతిపాదించిందన్న ఉత్తమ్.. కమీషన్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ డిజైన్ చేసి కాళేశ్వరం నిర్మించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా కాళేశ్వరం నిర్మించింది..అందుకోసం హై క్లాస్ లోన్స్ తీసుకొచ్చారని తెలిపారు. కాళేశ్వరం కట్టింది కమీషన్ల కోసమేనని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కాలేశ్వరంతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందన్నారు. ఏటా 10 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని చెప్పారు. ఆ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదన్నారు ఉత్తమ్.