హైదరాబాద్: స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. తాతా మధు వ్యాఖ్యల వెనుక మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ ముమ్మాటికీ దళిత వ్యతిరేకి అని విమర్శించారు.
తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత నేతగా ఉన్న రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
దళితులంటే బీఆర్ఎస్ నాయకత్వానికి మొదటి నుంచీ గిట్టదని మంత్రి ఆరోపించారు. దళిత నాయకులను అవమానించే ధోరణి ఆ పార్టీలో కొనసాగుతోందని విమర్శించారు.
అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులపై దాడులకు పాల్పడ్డారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు తావు లేదన్నారు.
తాతా మధు వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఒక్క వ్యక్తిని ఉద్దేశించినవి మాత్రమే కాకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా భావించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
