
న్యూఢిల్లీ: గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకే విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని మహా విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చాలా మంది చనిపోయారని.. మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పాలేమని పేర్కొన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా మృతి చెందారని.. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాగా, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
Also Read : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడియన్ ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై భారత్ లోని ఇంగ్లాండ్ హైకమిషన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.