టీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధి ఇంట్లో బాలికపై అత్యాచారం

టీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధి ఇంట్లో బాలికపై అత్యాచారం
  • మైనర్​ను రెస్క్యూ చేసిన చైల్డ్ ​ప్రొటెక్షన్ ​ఆఫీసర్లు
  • జగిత్యాల జిల్లా రాయికల్​లో కలకలం

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రానికి చెందిన ఓ టీఆర్ఎస్​ప్రజాప్రతినిధి ఇంట్లో పనిచేస్తున్న  బాలిక(17) గర్భం దాల్చడం కలకలం రేపుతోంది. ఇది కాస్తా సోషల్​ మీడియాలో వైరల్​కావడంతో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో తనిఖీలు చేపట్టి, బాలికను రెస్క్యూ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక కుటుంబం లీడర్​ ఇంటి పక్కనే చాలా ఏండ్లుగా నివాసముంటోంది. మొదట బాలిక అక్క అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత చెల్లె ఆ పని చేస్తోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడమే గాక ప్రస్తుతం ఆ చిన్నారి గర్భం దాల్చడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం డీసీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడెవరో కనిపెట్టే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్​ప్రజాప్రతినిధితో పాటు అదే ఇంట్లో ఉంటున్న డ్రైవర్​ పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక స్టేట్​మెంట్​ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వివరాలను బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం చైల్డ్​ప్రొటెక్షన్​ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్న బాలికను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉంచి ట్రీట్​మెంట్​ఇప్పిస్తున్నారు. పోలీసులు పోక్సో కింద కేసు ఫైల్​ చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై డీఎస్పీ వెంకట రమణను వివరణ కోరగా, ఇది సున్నితమైన కేసు అయినందున ఇప్పుడే వివరాలు బయటకు చెప్పలేమన్నారు.ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరా తీశారు.