
మేడిగడ్డ ఘటన చాలా సీరియస్ ఇష్యూ అని ఇరిగేషన్ మినిష్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారులతో వివరాలు తెప్పించుకుంటున్నామని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తామని చెప్పారు.. ఆ తర్వాత మేడిగడ్డకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేడిగడ్డకు ఖచ్చితంగా వెళ్తామని చెప్పారు ఉత్తమ్.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీల్లో జరిగిన అవకతవకలు, నష్టాలపై విచారణ జరిపిస్తామని ఇటీవలే ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిసెంబర్ 11వ తేదీ సోమవారం నగరంలోని జలసౌదలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారాయన. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగిందని.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడిందని తెలిపారు.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విచారణకు ఆదేశిస్తామని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాని చెప్పారు ఉత్తమ్. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో గోప్యత, రహస్య జీవోలు, అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయని వీటిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.