
- ఇంకా పూర్తిగాని 5,553 చెరువుల పనులు
- నాలుగు విడతల్లో కేటాయించింది 9,125 కోట్లు
- ఖర్చు చేసింది కేవలం 4,352 కోట్లే
- ఫస్ట్ టర్మ్లో పేరుతెచ్చిన పథకం
- రెండో టర్మ్లో నిధుల్లేక ఫుల్స్టాప్
- ఇకపై ఇరిగేషన్లో ఓన్లీ చెక్డ్యామ్ల పనులే
- ఇంకా ఇన్ కంప్లీట్గా 5,553 చెరువుల పనులు
హైదరాబాద్, వెలుగు: ‘మిషన్ కాకతీయ’ స్కీమ్ ఆపేశారు. ఒకప్పుడు ప్రభుత్వ టాప్ ప్రయారిటీల్లో ఒకటిగా కొనసాగిన ఈ స్కీమ్ కింద ఇకపై పనులేవీ చేపట్టవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం. చెరువులు, కుంటల్లో పూడిక తీసి నీటి నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ స్కీమ్.. రాష్ట్రంలో కొంత మేర వర్కవుట్ అయింది. రానురాను నిధుల విడుదలలో జాప్యం కారణంగా కొన్నాళ్లు స్లోగా నడిచిన ఈ స్కీమ్ను ఇప్పుడు పూర్తిగా నిలిపేశారు. ప్రస్తుత నిర్ణయంతో వివిధ దశల్లో ఉన్న 5,553 చెరువుల పనులు ఆగిపోయాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో 46,531 చెరువులు, కుంటలున్నట్టు 2014లో నిర్వహించిన మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేపట్టిన లెక్కల్లో తేలింది. మిషన్ కాకతీయ స్కీమ్కు రూపకల్పన చేసినప్పుడు ఏటా 9,300 చెరువుల్ని బాగుచేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఐదేళ్లలో మొత్తం చెరువులు, కుంటల్లో పూడిక తీసి, కట్టలు, తూములు బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్కీమ్ ఇంప్లిమెంటేషన్కు వచ్చేసరికి కేవలం 27,625 చెరువుల పనులకే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. వాటిని 4 విడతల్లో బాగు చేస్తామని చెప్పారు. వాటిలో 26,989 చెరువులు బాగు చేసేందుకు రూ.9,125 కోట్లు కేటాయించారు.
విడతల వారీగా పనుల తీరు
మిషన్ కాకతీయ మొదటి విడతలో శాంక్షన్ అయిన చెరువుల పనులే దాదాపు కంప్లీట్ అయ్యాయి. ఈ విడతలో శాంక్షన్ ఇచ్చిన వాటిలో కేవలం 20 చెరువుల పనులే పెండింగ్ ఉన్నాయి.
రెండో విడతలో అత్యధిక చెరువుల పనులకు పర్మిషన్ ఇచ్చినా ఇంకా వెయ్యికిపైగా చెరువుల పనులు పెండింగ్లోనే ఉన్నాయి.
మూడో విడతకు వచ్చే సరికే పనుల్లో స్పీడ్ తగ్గింది. నిధులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం చూపడంతో కేవలం 65 శాతం పనులే కంప్లీటయ్యాయి.
నాలుగో విడతకు వచ్చేసరికి స్కీం పూర్తిగా పక్కకుపోయింది. ఈ విడతలో కేవలం 40 శాతం పనులే చేశారు.
మొత్తంగా అన్ని విడతల్లో కలిపి శాంక్షన్ చేసిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదు. ఫిబ్రవరి మొదటి వారం వరకు మిషన్ కాకతీయలో రూ.4,352.18 కోట్ల పనులు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో రూ.450 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
నిధుల్లేవు.. పెండింగ్ పనులు ఆపండి
నాలుగు విడతల్లో శాంక్షన్ చేసిన వాటిలో 5,553 చెరువులు, కుంటల పనులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరత ఉందని, ఇక వాటి జోలికెళ్లొద్దని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఎక్కడైనా పది శాతం, అంతకన్నా కొంచెం అటుఇటుగా పనులు పెండింగ్లో ఉంటే ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని, అంతకుమించి పనులున్న చెరువులను వదిలేయాలని సూచించినట్టు సమాచారం. కేవలం 100లోపు చెరువుల్లోనే పది శాతంలోపు పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఈ ఎండాకాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఓన్లీ చెక్డ్యామ్లే..
మైనర్ ఇరిగేషన్లో ఇకపై చెక్డ్యాంల పనులే చేయడానికి ఇరిగేషన్ ఇంజనీర్లు రెడీ అవుతున్నారు. గుర్తించిన 1,235 చెక్డ్యాముల్లో ఈ ఏడాది 610 చెక్డ్యాంలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. వీటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 180 ఉన్నాయి. వీటిని ఈ ఏడాది జూన్ నాటికి కంప్లీట్ చేయాలని సూచించారు. మొత్తం చెక్డ్యామ్లకు రూ.4,947.24 కోట్లు అవసరమని అంచనా వేయగా, అందులో సగం వచ్చే బడ్జెట్లో ఇస్తామని సీఎం ప్రకటించారు. ఆ మేరకు కేటాయింపులు అనుమానమేనని, టాప్ ప్రయారిటీగా కరీంనగర్ చెక్ డ్యామ్లు పూర్తి చేస్తామని, ఇవి మినహా మరే పనులు చేపట్టబోమని అంటున్నారు.