ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శనివారం యాదగిరిగుట్టలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలతోపాటు వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే స్టూడెంట్స్ కు క్వాలిటీ ఎడ్యుకేషన్ తోపాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు.  

సోషల్ టీచర్ పై చర్యలు తీసుకోండి..

యాదగిరిగుట్టలోని జడ్పీహెచ్ఎస్ పరిశీలనకు వెళ్లిన సమయంలో తనతో అమర్యాదగా వ్యవహరించడమే కాకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన సోషల్ టీచర్ రాధికపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు, కలెక్టర్ కు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫోన్ లో ఫిర్యాదు చేశారు. స్కూల్ పరిశీలనకు వెళ్లిన టైంలో క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని, రోజూ ఒకేరకమైన కూరలు వండుతున్నారని స్టూడెంట్స్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్కూల్ ప్రాంగణంలో ఉన్న వంటశాలను ఆయన సందర్శించి వంటలను పరిశీలించారు.

ఈ విషయమై ఫుడ్ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్న సోషల్ టీచర్ రాధికను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో సదరు టీచర్.. 'వంటలు బాగానే ఉన్నయ్, నువ్వట్ల మాట్లాడొద్దు’ అని ఎమ్మెల్యేకు వేలు చూపిస్తూ ఊగిపోయారు. అక్కడే ఉన్న టీచర్లు, స్థానిక నాయకులు ఆ టీచర్ ను అక్కడి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేసినా దురుసుగా ప్రవర్తిస్తుండడంతో ఎమ్మెల్యే వంటశాల నుంచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన విషయాన్ని కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫోన్ చేసి వివరించారు.