
సూర్యాపేట, వెలుగు : కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్ప జలదోపిడీని అడ్డుకోలేమని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి చెప్పారు. సూర్యాపేటలోని క్యాంప్ ఆఫీస్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు ఏపీ సీఎం చంద్రబాబు రూపంలో దోపిడీకి గురవుతున్నాయన్నారు. గతంలో రాజశేఖర్రెడ్డి కృష్ణా నీటిని దోచుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్, టీడీపీ రెండూ తెలంగాణకు ద్రోహం చేసే పార్టీలేనని, ఆ రెండింటి కలయికలో పుట్టిన కలుపు మొక్క రేవంత్రెడ్డి అని ఎద్దేవా చేశారు. నదులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని రేవంత్రెడ్డి.. తన స్వార్థం కోసం ఎంతటి దుర్మార్గానికైనా దిగజారుతాడని మండిపడ్డారు. గతంలో రాజశేఖర్రెడ్డి 350 టీఎంసీల ప్రాజెక్ట్ను కట్టి కృష్ణా నీటిని తీసుకుపోతుంటే అప్పటి కాంగ్రెస్, టీడీపీ లీడర్లు ఎందుకు నోరు మెదపలేదన్నారు. మన నీళ్లు మనం వాడుకోవడానికి చంద్రబాబు అనుమతి అవసరమా అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కుల్ని ఆంధ్రకు అమ్ముతుంటే కేసీఆర్ చూస్తూ కూర్చోరన్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ కుట్రలను తిప్పి కొట్టి తెలంగాణ హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ ముందుంటుందని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపించేలా.. నీళ్ల కోసం మరో ఉద్యమం తప్పదన్నారు. రేవంత్ నాటకాన్ని, చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టి తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటామని చెప్పారు. కేసీఆర్ను జైలులో పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ను జైలులో పెట్టడం సాధ్యం కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరితో కలిసి మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.