
- గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు చాలంటావా? అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డికి బేసిన్లు, ప్రాజెక్ట్బేసిక్స్ తెలియవని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ‘‘సీఎం రేవంత్కు బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిన్ల మీద లేకుండాపోయింది. బేసిన్ల గురించి తెలుసుకోవడం బూతులు తెలుసుకున్నంత ఈజీ కాదు. దేశం ముందు రాష్ట్ర పరువు తీసేలా సీఎం మాట్లాడారు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో, బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో సీఎం రేవంత్ఉన్నారు.
ఈ ప్రాజెక్టుపై ఏపీ ఆరు నెలల నుంచి పని చేస్తూ, అనుమతుల కోసం కేంద్రానికి ఉత్తరాలు రాస్తూ ముందుకెళ్తున్నా.. అది ఏ బేసిన్లో ఉందని సీఎం రేవంత్ అడుగుతున్నారు. ఆయనకు రాష్ట్రంపై ఎంత కమిట్మెంట్ఉందో? ఎంత సిన్సియారిటీతో పని చేస్తున్నారో? బనకచర్లను ఆపేందుకు ఎంత శ్రద్ధ పెట్టారో? అఖిలపక్ష సమావేశంతో బయటపడింది” అని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీశ్ మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం సందర్భంగా రేవంత్ అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు.
అది చెప్పడానికి నువ్వెవరు?
సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లను ఆపేందుకు ప్రయత్నించకుండా, ఏపీ ఎన్ని నీళ్లయినా తీసుకుపోవచ్చంటూ మాట్లాడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘‘గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి.. ఎన్ని నీళ్లయినా తీసుకుపోండి అని ఏపీకి సీఎం రేవంత్ చెబుతున్నడు. నువ్వేమైనా రాజువా.. అది నువ్వెలా చెబుతావ్? మీ మూర్ఖత్వం వల్ల రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని ఇంజనీర్ సుబ్రహ్మణ్య ప్రసాద్చెప్పారు. అందులో సెంట్రల్ వాటర్కమిషన్ నుంచి 946 టీఎంసీలకు క్లియరెన్స్వచ్చిందని పేర్కొన్నారు. సముద్రంలో 3 వేల టీఎంసీలు కలుస్తున్నాయని, మిగులు జలాల్లో తెలంగాణకు 1,950 టీఎంసీలు ఇవ్వాలని నాడు కేసీఆర్ డిమాండ్ చేశారు.
కానీ గోదావరిలో వెయ్యి టీఎంసీలే ఇవ్వాలని సీఎం రేవంత్ఎలా చెప్తారు? ఇంకా చంద్రబాబును అడుక్కునే బుద్ధి పోలేదు. అయినా మనకు అనుమతులు వచ్చాక.. మనకు నీళ్లిచ్చేందుకు చంద్రబాబు ఎవరు? అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థమా?’’ అని ప్రశ్నించారు. ‘‘పాలమూరు జిల్లాలో పుట్టిన రేవంత్రెడ్డికి కనీసం కృష్ణా నదిపైనా అవగాహన లేకపోవడం దారుణం. అందులో కూడా 500 టీఎంసీలు ఇచ్చి మిగతా మొత్తం నీళ్లు తీసుకొమ్మని ఏపీకి చెబుతున్నారు. రేవంత్చేసిన ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు. తెలంగాణ హక్కులను చంద్రబాబుకు, ఏపీకి రాసిస్తా అంటే ప్రజలు ఊరుకోరు” అని అన్నారు.