బీజేపీతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ : రాజాసింగ్

బీజేపీతోనే దేశానికి ఉజ్వల భవిష్యత్ : రాజాసింగ్
  • సేవ చేసే విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
  • తాండూరు రోడ్ షోలో ఎమ్మెల్యే రాజాసింగ్

తాండూరు, వెలుగు:  దేశం కోసం.. ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే ప్రధాని కావాలా... లేక సలాం కొట్టే ప్రధాని కావాలా అంటూ ప్రశ్నించారు. ఆదివారం రాత్రి తాండూరులో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో  పాల్గొన్నారు. అనంతరం జరిగిన రోడ్ షోలో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు డబ్బు, మందుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని తీసుకొని బీజేపీకి ఓటు వేయాలని కోరారు.  

కోట్లాదిమంది హిందువుల దశాబ్దాల కోరిక అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని మోదీ దే అని అన్నారు. కోళ్ల దాణ, గుడ్లు, భూ కబ్జాదారుడు గడ్డం రంజిత్ రెడ్డి అని ఆరోపించారు.  కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.  ప్రధానిగా మోదీని మరోసారి గెలిపిస్తేనే దేశం సుభిక్షం, సురక్షితంగా ఉంటారని అన్నారు.  పదేండ్ల  మోదీ పాలనలో దేశంలోకి రావాలంటే తీవ్రవాదులే భయపడుతున్నారన్నారు.  విద్య, వైద్యం చేయూత  వంటి సేవల్లో ముందుండే నేత  కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

ఏ బూత్ లో బీజేపీ ఎక్కువ మెజారిటీ తీసుకొస్తారో.. గెలిచాక వారిని సన్మానిస్తానని హామీ ఇచ్చారు.  ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతం ఉన్న పార్టీ బీజేపీ అని, అందుకే ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే చేవెళ్ల ను అభివృద్ధి పథంలో నిలుపుతానని అన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  రమేశ్​ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ ,అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.