
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్చేశారు. ‘లక్షకోట్ల అప్పుతో రాష్ట్రానికి, రైతులకు గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా మీరు వచ్చినందుకు అభినందనలు. ఏ ఇంజినీరింగ్ చదవని మీ తండ్రి స్వయంగా రీడిజైన్ చేసిన ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో తెలుసుకునే అవకాశంగా దీన్ని మీరు భావించాలి.
ఐదేండ్లుగా యాది మరిచి, కనీసం ఇప్పుడు వచ్చినందుకైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతులను మీరు పరామర్శించాలి. ప్రాణహిత ప్రాజెక్టును గాలికొదిలి, రాష్ట్రానికి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు మీరు తీరని అన్యాయం చేశారు. మంచిర్యాల జిల్లాలో 45 వేల ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20వేల ఎకరాలు, భూపాలపల్లి జిల్లాలో 8వేల ఎకరాల్లో ఏటా రెండు పంటలు నష్టపోతున్న రైతులను కలిసి మీ తండ్రి చేసిన పాపానికి క్షమాపణ చెప్పండి”అని ట్విటర్లో కేటీఆర్ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.