హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు కేసీఆర్ జాతీయ అధ్యక్షుడైతే రాష్ట్ర పగ్గాలు ఎవరికిస్తారనే దానిపై కొంత సస్పెన్స్ ఉండాలని, ఇప్పుడే తొందరేముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రధాని నరేంద్రమోడీకి జాతీయ స్థాయిలో కేసీఆరే ప్రత్యామ్నాయమని, ఈ విషయం బీజేపీ నేతలకు అర్థమైందని, త్వరలోనే దేశ ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ డ్యామేజ్ అయిం దని విమర్శించారు. టీఆర్ఎస్లో ‘తెలంగాణ’ ఉంది కాబట్టి.. తెలంగాణ సెంటిమెంట్తోనే రెండుసార్లు గెలిచామనేది కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని, అభివృద్ధిని చూసే ప్రజలు గెలిపించారని, మూడోసారి కూడా అభివృద్ధి, సంక్షేమంతోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తన ఇంట్లో కవిత మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘తెలంగాణలో బతుకమ్మ ఎట్లనో.. ఆంధ్రాలో అట్లతద్దె, బీహార్లో చత్ పూజ అట్లనే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పండుగ సాంస్కృతిక చిహ్నంలా నిలుస్తుంది”అని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ టైంలో తాము ఆంధ్ర ప్రజలను తిట్టలేదని, లీడర్లనే విమర్శించామని చెప్పారు. మోడీ నుంచి బండి సంజయ్ వరకు మహిళలను అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ నే ఉన్నారని, వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కవిత హెచ్చరించారు. సంజయ్ తనను మాత్ర మే అవమానించలేదని, బతుకమ్మను అవహేళన చేశారని ఆమె అన్నారు. బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ, జై తెలంగాణ ఎక్కడం వెనుక తన 12 ఏండ్ల కష్టం ఉందని తెలిపారు.
కేసీఆర్ ఏ పనిచేసినా యాగాలు చేస్తరు
బీఆర్ఎస్కు మానవశక్తికి తోడు దైవశక్తి అవసరం కాబట్టే యాగంతో ప్రారంభిస్తున్నారని కవిత తెలి పారు. కేసీఆర్ ఏ పని చేసినా యాగాలు చేయడం సహజం అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్లో చాలా రాష్ట్రాల నుంచి చేరికలుంటాయని చెప్పారు. బీఆర్ఎస్ ఇండిపెండెంట్ రాజకీయ పార్టీ అని, అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులున్నారని తెలిపారు.
భారత్ జాగృతిని ఎప్పుడో రిజిస్టర్ చేసినం
తెలంగాణ జాగృతి ఎప్పుడూ సైలెంట్ లేదని, సమయాన్ని బట్టి పంథా మార్చుకుంటూ వచ్చామని కవి త చెప్పారు. తనకు దేశవ్యాప్తంగా సన్నిహిత సంబంధాలున్నాయని, జాగృతి విస్తరణకు అవి సహాయ పడుతాయన్నారు. భారత్ జాగృతిని ఎప్పుడో రిజిస్టర్ చేశామని, ఇండియా టుడేతో కలిసి సాహిత్య జాగృతి పేరుతో జ్ఞాన్పీఠ్ స్థాయి అవార్డు ప్రదానం చేస్తున్నామన్నారు. సంస్కృతి గురించి మాట్లాడే వాళ్లు, ప్రశ్నించే వాళ్లపై అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేయడం కేంద్ర పాలకులకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
షర్మిల అంటే షర్మిల పాల్.. అర్వింద్ను ఓడిస్త
వైఎస్ షర్మిల గురించి మాట్లాడటానికి ఏమీ లేదని కవిత అన్నారు. ఇప్పుడు షర్మిల అంటే షర్మిల పాల్ అనే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలన్నీ ఆరెంజ్ ప్యారెట్సేనని ఆరోపించారు. నిర్మలా సీతారామన్ వీక్ హిందీ గురించి కాకుండా వీక్ రూపీ గురించి మాట్లాడితే బాగుండేదని ఆమె అన్నారు. నిజామాబాద్కు పసుపు బోర్డు రాకుండా, తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నదే నిర్మలా సీతారామన్ అని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు ఉపయోగించుకోవడమే బీజేపీ రణనీతి అని దుయ్యబట్టారు. తాను కేసీఆర్ సైనికురాలినని.. బాస్ ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తానని కవిత తెలిపారు. ధర్మపురి అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికెళ్లి ప్రచారం చేసి ఓడిస్తానన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తం
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేస్తామని, ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని కవిత చెప్పారు. తాము ఏ పార్టీని సిల్లీగా తీసుకోబోమని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వర్కవుట్ అయి ఉంటే మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ ఎందుకు కోల్పోయిందని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు సమస్యను కేంద్రం పరిష్కరించలేకపోయిందని కవిత విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చల ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించగలిగామని, చర్చలతోనే రాష్ట్రాల మధ్య బోర్డర్ సమస్యలు పరిష్కారిస్తామని చెప్తామని, ఇదే బీఆర్ఎస్ విధానమని ఆమె అన్నారు. ఏపీ రాజకీయాలు, పోటీ గురించి ఇప్పుడే మాట్లాడబోమని తెలిపారు.