బెంగళూరులో హెల్త్ వర్కర్లపై దాడి

బెంగళూరులో హెల్త్ వర్కర్లపై దాడి
  • 59 మంది అరెస్టు, కేసు నమోదు

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో హెల్త్ వర్కర్లు, పోలీసులు, అధికారులపై స్థానికులు దాడికి దిగారు. టిన్ షీట్లు, బారికేడ్లను తొలగించారు. పాదరాయనపురలో ఈ ఘటన జరిగింది. 18 కరోనా కేసులు నమోదు కావడంతో పాదరాయనపుర ఏరియాను ఇదివరకే రెడ్ జోన్ గా ప్రకటించి సీల్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ కు వెళ్లొచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంటాక్ట్ అయినవారిని అధికారులు గుర్తించారు. వారందర్నీ క్వారంటైన్ కు తరలించేందుకు ఆదివారం రాత్రి 7 గంటలకు హెల్త్ వర్కర్లు, పోలీసులు, అధికారుల టీమ్ పాదరాయనపుర చేరుకుంది. 200 మంది స్థానికులు వారిని అడ్డుకున్నారు. స్పాట్ లోనే టెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో టిన్ షీట్లు, బారికేడ్లను తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. దాడి ఘటనపై కర్నాటక హోమ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి మాట్లాడుతూ..హెల్త్ వర్కర్లకు దెబ్బలు తగలలేదున్నారు. దాడికి పాల్పడిన 59 మందిని అరెస్టు చేశామని చెప్పారు. ఐదు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గత వారం మధ్యప్రదేశ్ లోని దెవాస్ జిల్లాలో శానిటేషన్ వర్కర్లపై స్థానికులు దాడి చేశారు. బీహార్ లోనూ హెల్త్ వర్కర్ల పై దాడికి సంబంధించి 24 గంటల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.