వాతావరణ శాఖ చల్లటి కబురు

వాతావరణ శాఖ చల్లటి కబురు

జూన్ 07వ తేదీ మంగళవారం రాష్ట్రంలోకి  నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 10 నాటికి  పూర్తిస్థాయిలో రాష్ట్రంలో  వ్యాపిస్తాయని, చురుగ్గా  కదలడంతో.. ఈసారి  సాధరణం కంటే  ఎక్కువగా  వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే..  రుతుపవనాల రాక రెండ్రోజులు ఆలస్యమైనట్లు  తెలిపింది. మే 29నే  కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ.. వాటి కదలిక ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించడం ఆలస్యమైందంది. ఈసారి నైరుతి సీజన్ కు ముందు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎండలతో పాటు ఉక్కపోతలు విపరీతంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోయారు. వడగాలులు  వీయడంతో.. ప్రజలు  ఇబ్బందులు పడ్డారు.

రుతుపవనాలు పూర్తిగా  వ్యాప్తి చెందే వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయంది. అధిక వేడి, ఉక్కపోతల వల్ల విద్యుత్ కు  విపరీతంగా డిమాండ్ పెరిగింది. నైరుతి ప్రభావంతో  ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి  భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు,  కర్నూలు, కడప,  విశాఖ, ఒంగోలు జిల్లాల్లో ఉరుములు , మెరుపులతో భారీ వర్షం పడుతుంది. పలుచోట్ల  ఈదురు గాలులతో  చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో  పలు ప్రాంతాల్లో  విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏపీ వ్యాప్తంగా తొలకరి జల్లులు  పడుతుండటంతో.. వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు  అన్నదాతలు.

మరిన్ని వార్తల కోసం : -

కేసీఆర్ కు ప్రజలపై చిత్తశుద్ధిలేదు

పేదలు బతకడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదా?