
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ హుస్సేన్సాగర్ లేక్లో హోరాహోరీగా జరుగుతున్న మాన్సూన్ రెగట్టా పోటీలకు ప్రతికూల వాతావరణం అడ్డొచ్చింది. దాంతో ఐదో రోజు, శుక్రవారం పోటీలు పూర్తిగా నిలిచిపోయాయి. 12 రేసుల సిరీస్లో ఇంకా నాలుగు రేసులు మిగిలున్నాయి. ప్రస్తుతం లీడర్బోర్డులో టాప్ ప్లేస్ల్లో ఉన్న సెయిలర్లు తమ స్థానాలను నిలుపుకునే అవకాశం ఉంది.
పోటీలకు చివరి రోజైన శనివారం కూడా వాతావరణం అనుకూలించకపోతే ప్రస్తుత పోడియం స్థానాల్లో ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. కాగా, ఆసియా గేమ్స్ టాలెంట్ హంట్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యంగ్ సెయిలర్లు యాచ్ క్లబ్లో రెండు నెలల ట్రెయినింగ్ పూర్తి చేసుకున్నారు. వీరందరికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల సెక్రటరీ బి. సైదులు, జాయింట్ సెక్రటరీ జి. తిరుపతి సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు.