కొడుకుతో గొడవ : బిల్డింగ్ నుంచి దూకి తల్లి సూసైడ్

కొడుకుతో గొడవ : బిల్డింగ్ నుంచి దూకి తల్లి సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు: ఖాళీగా ఉండకుండా ఏదైనా జాబ్ చేయాలని కొడుకుతో గొడవ పడింది తల్లి.. దీంతో కోపంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు కొడుకు.. తాను తిట్టడం వల్లే కొడుకు  వెళ్లిపోయాడని బాధపడింది ఆ తల్లి.. తాము ఉంటున్న బిల్డింగ్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్​లోని రాయదుర్గంలో బుధవారం రాత్రి జరిగిందీ ఘటన. మహబూబ్​నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన పేటా పెంటయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్​కు వలస వచ్చాడు. మణికొండ చిత్రపురికాలనీలో ఉంటూ కారు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. పెంటయ్య భార్య మౌనిక (37) ఇంట్లోనే ఉంటుంది.

వీరి కొడుకు సాయి గణేశ్.. ఇంటర్​ ఫెయిలై  ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయమై బుధవారం రాత్రి కొడుకుతో మౌనిక మాట్లాడింది. ‘ఎన్ని రోజులు ఖాళీగా కూర్చుంటావ్. ఏదైన జాబ్ చేయవచ్చు కదా’ అని చెప్పింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి గొడవ జరిగింది. దీంతో సాయి గణేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తాను తిట్టడం వల్లే కొడుకు వెళ్లిపోయాడని మౌనిక మనస్తాపానికి గురైంది. 11.10 గంటల సమయంలో తాము ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్థుపై నుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడ్డ మౌనికను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.  రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఏ తప్పు చేసినా..