నేడు సెక్రటేరియట్‌లో ఉన్న మంత్రి రేపు జైల్లో ఉంటడు

నేడు సెక్రటేరియట్‌లో ఉన్న మంత్రి రేపు జైల్లో ఉంటడు

కమ్మరపల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన మాలవత్ సిద్ధార్థ్ కుటుంబాన్ని బీజేపీ ఎంపీ అరవింద్ పరామర్శించారు. సిద్ధార్థ్ బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని.. స్థానిక మంత్రి హత్య చేయించాడని ఆయన ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేస్తే నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీనే అని ఆయన అన్నారు.  సిద్ధార్థ్ కుటుంబానికి ఎంపీ అరవింద్ లక్ష రూపాయల ఆర్థికసాయం అందించారు.

‘సిద్ధార్థ్ తండ్రి అనారోగ్యంతో మంచాన పడితే.. సీఎం రిలీఫ్ ఫండ్ రాకుండా టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇలాంటి హత్యలతో బీజేపీని భయపెట్టాలని అనుకుంటున్నారా? సిద్ధార్థ్ హత్యలో నిందితుడికి పోలీసు‌స్టేషన్‌లో రాచ మర్యాదలు ఎందుకు, ఎవరి సహాయంతో చేశారు? సిద్ధార్థ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం. దోషులను కఠినంగా శిక్షించాలి. గంజాయి కేసులలో టీఆర్ఎస్ నాయకులే ఉన్నారని గ్రామాలన్నీ కోడై కూస్తున్నాయి. గంజాయి స్మగ్లింగ్ చేసేవారిని మంత్రి కాపాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలను చంపాలని చూస్తే.. కార్యకర్తల కోసం ఎంపీ అరవిందే కాదు; రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నాయకులు సైతం బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటారు. హత్య చేసిన వారు ఎంతటి వారయిన ఉరి కంభం ఎక్కాల్సిందే. స్టేషన్‌లో ఉన్న నిందితులు.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం. లాకప్‌లో ఉన్న నిందితులకు సెల్‌ఫోన్ ఇచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హత్యా రాజకీయాలు చేయాలనుకుంటే నేడు సెక్రటేరియట్‌లో ఉన్న మంత్రి రేపు జైల్లో ఉంటారు’ అని ఆయన హెచ్చరించారు.