హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు.
భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు ఉన్నా… ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వరద గుప్పిట చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపకపోవడమే ముంపునకు కారణమన్నారు. ఇళ్లు కూలిపోయిన బాధితులకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు.
బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని, స్థానిక పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి… సహాయ చర్యలు చేపట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు.