ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం చిన్న‌మ్మ

ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి మూల కారణం చిన్న‌మ్మ

తెలంగాణ సుదీర్ఘ క‌ల సాధ‌న‌లో చిన్న‌మ్మ‌గా సుష్మ స్వ‌రాజ్ పాత్ర మరువలేనిదని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక రాష్ట్రం కల సాకారం కావడానికి ఆమె మూల కారణమ‌న్నారు. గురువారం మాజీ కేంద్రమంత్రి, పద్మ విభూషణ్ సుష్మా స్వరాజ్ వ‌ర్ధంతి సందర్భంగా బండి సంజ‌య్ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌‌ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో.. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గొంతుక వినిపించిన ధీర వనిత సుష్మా స్వరాజ్ అని కొనియాడారు . పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ యువకులు బలిదానం కావొద్దని .. తెలంగాణ సుసాధ్యం అవుతుందని భరోసా నింపిన గొప్ప నాయకురాలు అని చెప్పారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో గల్ఫ్‌ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలంగాణ ప్రవాసులకు మాతృమూర్తిగా సాయం చేశార‌న్నారు.

“సుష్మా స్వరాజ్ లేరన్నది దేశానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు. ప్రజా సమస్యల పై ఆమె స్పందించే తీరు నేటితరం నాయకులకు స్ఫూర్తి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పాలనా దక్షతతో వ్యవహరించి తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచిన యోధురాలు. భారతీయ సంస్కృతికి పర్యాయ పదం, మృదుస్వభావి, రాజనీతి కోవిధురాలు, గొప్ప వక్త, తెలంగాణ చిన్నమ్మ గా ప్రసిద్ధి పొందిన మాజీ కేంద్రమంత్రి, పద్మ విభూషణ్ సుష్మా స్వరాజ్ పుణ్య తిథి సందర్భంగా వారి సేవలను మననం చేసుకుంటూ.. వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాం” అని తెలిపారు సంజ‌య్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేంధర్ రెడ్డి, బంగారు శ్రుతి,కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

MP Bandi Sanjay paid a heartfelt tribute to Sushma Swaraj death anniversary at Bjp Office