2022 ఐపీఎల్​లోనూ ధోనీ ఆడతాడు: కాశీ విశ్వనాథన్

2022 ఐపీఎల్​లోనూ ధోనీ ఆడతాడు: కాశీ విశ్వనాథన్

ఈ ఏడాదితో పాటు రానున్న రెండేళ్ల పాటు చెన్నైకి ధోనీ కెప్టెన్​గా ఉంటాడని చెన్నై సూపర్ కింగ్స్(CSK) సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్​ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తమతో మరికొన్నేళ్ల పాటు ధోనీ పయనిస్తాడని అనుకున్నట్లు తెలిపారు. గతేడాది ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వరల్డ్ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడకపోయినప్పటికీ, ఐపీఎల్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ధోనీ 2021, 2022 సీజన్ల వరకు CSK జట్టుతోనే ఉంటాడని అనుకుంటున్నట్టు కాశీ విశ్వనాథన్ చెప్పారు. ప్రస్తుతం ధోనీకి సంబంధించిన సమాచారం మీడియా ద్వారానే తెలుసుకుంటున్నామని, ఐపీఎల్ కోసం ధోనీ తన సొంత రాష్ట్రం జార్ఖండ్ లో ఇండోర్ నెట్స్ లో ప్రాక్టీసు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. అయితే తమ కెప్టెన్ ధోనీ ఆటతీరు పట్లకు తమకు ఎప్పుడూ బాధ లేదని అన్నారు.

అంతేకాదు తన బాధ్యతలు ఏమిటో ధోనీకి తెలుసని చెప్పారు విశ్వనాథన్. తన గురించి, జట్టు గురించి తనే చూసుకుంటాడన్నారు. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా మొదలయ్యే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆగస్టు 21న బయల్దేరనుంది. అంతకుముందు ఆగస్టు 14న జట్టు ఆటగాళ్లంతా చెన్నైలో కలుసుకోనున్నారు.