- రెండో ప్లేస్కి దిగిన జాంగ్ షాన్షన్
న్యూఢిల్లీ: చైనా సంపన్నుడు జాంగ్ షాన్షన్ను వెనక్కినెట్టి మళ్లీ ఆసియా సంపన్నుడయ్యారు ముకేశ్ అంబానీ. జాంగ్ షాన్షన్ ఓనరయిన బాటిల్డ్ వాటర్ కంపెనీ షేర్లు గత వారం రోజుల్లో 20 శాతం పతనం కావడంతో 80 బిలియన్ డాలర్ల సంపదతో ముకేశ్ ముందుకు దూసుకెళ్లారు. చైనా బిలినియర్ సంపద కిందటి వారంలో 22 బిలియన్ డాలర్లకు పైగా తగ్గి 76.6 బిలియన్ డాలర్లకు చేరింది. అలీబాబా గ్రూప్ ఫౌండరయిన జాక్ మా నుంచి ఆసియా సంపన్నుడి కిరీటాన్ని అందుకున్న ముకేశ్ గత రెండేళ్లలో ఎక్కువకాలమే దానిని నిలబెట్టుకోగలిగారు. డిసెంబర్లో జాంగ్ కంపెనీలు రెండు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావడంతో ముకేశ్ తన కిరీటాన్ని పోగొట్టుకోవల్సి వచ్చింది. ఇతర మార్కెట్లతోపాటు ఇండియా స్టాక్మార్కెట్లూ పతనమైనా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పెద్దగా పడకపోవడంతో ముకేశ్ సంపద స్థిరంగా నిలిచింది. ఆయిల్ బిజినెస్ను సెపరేట్ కంపెనీగా ఏర్పాటు చేస్తున్నట్లు కిందటి వారంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ కారణంగానే ఆ కంపెనీ షేరు పెద్దగా పడకుండా నిలిచిందని అంచనా వేస్తున్నారు. ఆయిల్ కంపెనీలో సౌదీ కంపెనీ ఆరామ్కో పెట్టుబడులు పెడుతుందనే ఆశాభావంతో ముకేశ్ ఉన్నారు. ఇందుకోసమే దానిని సెపరేట్ చేశారు. దీంతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని
భావిస్తున్నారు.