సికింద్రాబాద్,వెలుగు: నలుగురు వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ క్లాక్ టవర్వద్ద చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మార్కెట్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. టోలీచౌక్ లో ఉండే ఫయాజ్ఖాన్(32), అబీద్ఖాన్(30) అన్నదమ్ములు.
ఇటీవల ఫయాజాఖాన్ భార్య చనిపోగా మానసికంగా కుంగిపోయిన అతను క్లాక్టవర్ వద్ద ఫుట్ పాత్పై ఉంటున్నాడు. అన్న ఇంటికి రాకపోగా కలిసేందుకు అబీద్ఖాన్ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు క్లాక్ టవర్వద్దకు వెళ్లాడు. అన్నదమ్ములు మాట్లాడుకుంటుండగా అదే ఫుట్పాత్పై ఉంటున్న రాజు మరో వ్యక్తిపై దాడి చేస్తుండగా.. చూసిన అబీద్ఖాన్వారిని వారించాడు. దీంతో ఆవేశానికి రాజు లోనై అబీద్ఖాన్పై రాళ్లతో దాడికి దిగాడు. తన తమ్ముడిపై దాడికి పాల్పడిన రాజుపై ఫయాజ్రాళ్లతో ఎదురు దాడికి దిగాడు. దీంతో నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు.
ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. రోడ్డుపైకి వచ్చి దాడి చేసుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అబిద్ఖాన్, ఫయాజ్ఖాన్, రాజు తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కనే పడి స్పృహ కోల్పోయారు. స్వల్ప గాయాలపాలైన మరో వ్యక్తి పారిపోయాడు. సమాచారం తెలియడంతో మార్కెట్ పోలీసులు వెళ్లి గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు.