కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలోని పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలులో ఉంది. దాంతో జనాలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఎమర్జెన్సీ లేదా వైద్య అవసరాల కోసం మాత్రమే బయటకు రావడానికి పోలీసులు అనుమతులిస్తున్నారు. దాంతో జనాలు రోడ్ల మీదకు రావడానికి కొత్తకొత్త సాకులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని ఓ వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి.. పోలీసులకు విచిత్రమైన కారణం చెప్పాడు. అది కాస్తా ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి బుట్టలో కోడిని పెట్టుకొని రోడ్డు మీదకు వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి.. బయటకెందుకు వచ్చావని ప్రశ్నించారు. అందుకు ఆ వ్యక్తి.. తన కోడికి ‘మలబద్ధకం’ వచ్చిందని, చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. అది విన్న పోలీసులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ వ్యక్తి చెప్పిన కారణంతో ఏకీభవించని పోలీసులు.. నచ్చజెప్పి ఇంటికి పంపించారు.
ఈ సంఘటనకు సంబంధించిన 30 సెకన్ల క్లిప్ను మే 29న అమిత్ ఉపాధ్యాయ్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి చెప్పిన కారణాన్ని మెచ్చుకుంటూ.. ఈ కారణం భారతీయుల సృజనాత్మకతకు అద్దం పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
The police in #Gadag had a hearty laugh after a man claimed be was taking the hen to a vet as it had constipation issues. Police however sent him back home @santwana99 @ramupatil_TNIE @XpressBengaluru @KannadaPrabha @raghukoppar @karnatakacom @NammaBengaluroo @DgpKarnataka pic.twitter.com/BEdxton5ce
— Amit Upadhye (@Amitsen_TNIE) May 29, 2021