శశాంక్‌‌ సెల్ఫిష్‌‌..యాంటీ ఇండియన్‌‌

శశాంక్‌‌ సెల్ఫిష్‌‌..యాంటీ ఇండియన్‌‌

ముంబై: ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ కౌన్సిల్‌‌ (ఐసీసీ) చైర్మన్‌‌ పదవి నుంచి తప్పుకున్న శశాంక్‌‌ మనోహర్‌‌పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌‌ ఎన్‌‌. శ్రీనివాసన్‌‌ తీవ్ర విమర్శలు చేశారు. శశాంక్‌‌.. సెల్ఫిష్‌‌ అని, యాంటీ ఇండియన్‌‌ అని ఎద్దేవా చేశారు. ఐసీసీ బాస్‌‌గా ఉండి ఇండియన్ క్రికెట్‌‌కు ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. మనోహర్‌‌ పదవి నుంచి వైదొగలడం శుభపరిణామమని అన్నారు. 2015లో సంక్షోభంలో ఉన్న బీసీసీఐని వదలి ఐసీసీ పగ్గాలు అందుకోవాలన్నది శశాంక్‌‌ సెల్ఫిష్‌‌ డెసిజన్‌‌ అన్నారు. ఇప్పుడు బీసీసీఐకి కొత్త నాయకత్వం (గంగూలీ) రావడంతో తిరిగి ఇండియాకు ప్రాతినిధ్యం వహించలేనని ఆయనకు అర్థమైందని, పదవిలో కొనసాగే చాన్స్‌‌ లేదని తెలిసే పారిపోయాడని ఎద్దేవా చేశారు. ‘ఇండియన్ క్రికెట్‌‌కు శశాంక్‌‌ అపార నష్టం కలిగించారు. ఆయన తప్పుకున్నారని తెలిసి ఇండియన్‌‌ బోర్డులో ఇన్వాల్వ్‌‌ అయిన ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. ఈ గేమ్‌‌లో ఫైనాన్షియల్‌గానే కాకుండా ఐసీసీలో ఇండియా అవకాశాలను శశాంక్‌ దెబ్బతీశారు. ఆయన యాంటీ ఇండియన్‌‌. వరల్డ్‌‌ క్రికెట్‌‌లో ఇండియా ఇంపార్టెన్స్‌‌ ను తగ్గించారు.

బీసీసీఐ నుంచి ఇప్పుడు ఎలాంటి మద్దతు దొరకదని తెలిసే పారిపోతున్నారు. శశాంక్‌‌ నిష్క్రమణ ఇండియన్ క్రికెట్‌‌కు రిలీఫ్‌‌. ఓ పోరాటంలో ఆయన ఎప్పుడూ పాలుపంచుకోలేదు. 2015లో బీసీసీఐ అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా ఐసీసీని విడిచిపెట్టారు. ఏదేమైనా ఐసీసీలో ఇకపై ఆయన ఉండరని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నా’ అని ఐసీసీ తొలి చైర్మన్‌‌ అయిన శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు శశాంక్‌‌తో కలిసి పనిచేసిన శ్రీని తర్వాత ఆయనకు ప్రత్యర్థిగా మారారు. ఇండియన్‌‌ క్రికెట్‌‌కు మరే అడ్మినిస్ట్రేటర్‌‌ చేయనంత నష్టం మనోహర్‌‌ చేశాడని శ్రీని బలంగా నమ్ముతారు. మరోవైపు శశాంక్ తన పదవీకాలంలో ఇండియన్‌‌ క్రికెట్‌‌కు, బీసీసీఐకి ఎంత నష్టం చేశారో అంచనా వేసుకోవాలని బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా ఎద్దేవా వేశారు. ఈ ఖాళీ టైమ్‌‌లో దానికి విలువ కట్టాలని సూచించారు. గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐకి ఐసీసీలో బలమైన, ప్రయోజనకరమైన ప్రాతినిధ్యం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.