నాగార్జున(Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని(Vijay Binny) దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన చిత్రం నా సామిరంగ(Naa Saamiranga). ఈనెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నాగార్జున మాట్లాడుతూ ‘సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఆరోజు సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకులకు ఆనవాయితీ. ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు కూడా చూస్తారు. నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకుని, ‘గుంటూరు కారం’తో వస్తున్న మహేష్కు, 75 సినిమాలు పూర్తి చేసుకుని ‘సైంధవ్’తో వస్తున్న వెంకీకి, ‘హనుమాన్’తో వస్తున్న తేజకు ఆల్ ద బెస్ట్. సినిమా నచ్చితే ఎంతలా ఆదరిస్తారో రెండు పండుగలకు చూశా.
ఈ సినిమా కూడా నచ్చుతుందని, ఈ పండుగకు కూడా అలాగే ఆదరిస్తారని ‘నా సామిరంగ’తో వస్తున్నా. మా సినిమాకు కీరవాణి గారు స్టార్. ఆయన దర్శకుడి వెనుక ఉండి, మూడు నెలల్లో సినిమా పూర్తి చేయించారు. షూట్ మొదలవకముందే మూడు పాటలు ఇచ్చారు. ఫైట్ సీన్ తీయకుండానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రెడీ చేశారు. మూడు నెలల్లో సినిమా చేయడం అంత ఈజీ కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. వాళ్లందరి గురించి సక్సెస్ మీట్లో చెబుతాను. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ హిట్ కొడుతున్నాడు’ అని చెప్పారు. నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ అన్నారు. కొరియోగ్రాఫర్గా ఉన్న తనను దర్శకుడిని చేసిన నాగార్జున గారికి లైఫ్ అంతా రుణపడి ఉంటాను’ అని విజయ్ బెన్ని చెప్పాడు.
కీరవాణి మాట్లాడుతూ ‘కొత్త దర్శకులను గుర్తించి ప్రోత్సహించడంలో నాగార్జున ముందుంటారు. ఇందులోని పాటతో సంగీత్ వేడుకలన్నీ ఇకపై ‘దుమ్ము దుకాణం’ ఫంక్షన్స్గా మారిపోతాయి’ అన్నారు. ‘ఇందులో నాలుగు మంచి పాటలు రాశాను. చాలా ఆనందంగా ఉంది’ అన్నారు చంద్రబోస్. హీరోయిన్స్ ఆషికా రంగనాధ్, రుక్సర్, మిర్నా, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.