
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. క్రస్ట్గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు, కలరింగ్ వంటి పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 26 క్రస్ట్ గేట్లను ట్రయల్ రన్ నిర్వహిస్తూ గ్రీజింగ్ పనులు చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడం, ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి వరద నీరు వస్తుండడంతో సాగర్ రిపేర్లు త్వరగా పూర్తి చేస్తున్నారు.
క్రస్ట్ గేట్ల రిపేర్లను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామని నాగార్జున సాగర్ డ్యామ్ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు తెలిపారు. డ్యామ్ గ్యాలరీలో క్లీనింగ్, లైటింగ్ పనులు చేస్తున్నట్లు చెప్పారు. డ్యామ్ స్పిల్ వే పనులకు సంబంధించిన ప్రపోజల్స్ను ఉన్నతాధికారులకు పంపించామని, ఆ పనులు చేయడానికి జులై చివరి వారం వరకు అవకాశం ఉందన్నారు.