అత్యాచారం, హత్య కేసులో ఉరి.. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

అత్యాచారం, హత్య కేసులో ఉరి.. నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు
  • 2013 ఏప్రిల్లో ఘటన
  • 12 ఏండ్ల పాటు కొనసాగిన వాదనలు
  • బాలిక ఫ్యామిలీకి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం

నల్గొండ, వెలుగు: బాలికను రేప్ చేసి చంపేసిన వ్యక్తికి నల్గొండ పోక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2013లో ఈ ఘటన జరిగింది. నల్గొండ హైదర్​ఖాన్ గూడలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏండ్ల బాలికపై మాన్యం చెల్కకు చెందిన మహ్మద్ ముక్రం అత్యాచారం చేశాడు. రేప్ చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో బాలిక మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. తర్వాత డెడ్​బాడీని డ్రైనేజీలో పడేశాడు. ఈ ఘటన 2013, ఏప్రిల్ 28న జరిగింది. బాలిక కనిపించకపోవడంతో పేరెంట్స్ నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాక విచారించిన పోలీసులు.. 2015లో చార్జిషీట్ దాఖలు చేశారు.

పదేండ్ల పాటు సుదీర్ఘ వాదనలు, వాయిదాలు కొనసాగాయి. పోలీసులు సమర్పించిన ప్రూఫ్స్​తో సెక్షన్ 376-ఏ, 302, 201 , లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం 2012లోని సెక్షన్ 6 కింద నిందితుడు ముక్రంను పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో నిందితుడు ముక్రంకు ఉరిశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్​చార్జి జడ్జి జస్టిస్ రోజా రమణి తీర్పు వెలువరించారు. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించారు. బాలిక ఫ్యామిలీకి రూ.10 లక్షలు పరిహారం అందించాలని తీర్పులో పేర్కొన్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు: శరత్ చంద్ర పవార్, ఎస్పీ
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని నల్గొండ ఎస్పీ శరత్​చంద్ర పవార్ అన్నారు. మహ్మద్ ముక్రంకు పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. నిందితుడు ముక్రంకు శిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించి కోర్టుకు అందించిన పోలీసు ఆఫీసర్లను ఆయన అభినందించారు.